1,495 కేంద్రాల్లో నిర్వహణ – లక్షలాది విద్యార్థుల హాజరు
హైదరాబాద్, ఫిబ్రవరి 25, 2026:
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు (IPE) బుధవారం సజావుగా ప్రారంభమయ్యాయి. మొత్తం 1,495 పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పరీక్షలను నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సెకండ్ లాంగ్వేజ్ పేపర్-I పరీక్షకు 4,89,126 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు హాజరయ్యారు.
గత సంవత్సరం మాదిరిగానే, విద్యార్థుల సౌకర్యార్థం పరీక్షా కేంద్రాలలోకి ప్రవేశించేందుకు ఐదు నిమిషాల గ్రేస్ టైమ్ను అధికారులు అనుమతించారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు కొనసాగేందుకు తెలంగాణ లోని అన్ని జిల్లాల యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేశారు.
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ప్రకారం, ఈసారి ప్రశ్నాపత్రాల రహస్యత కాపాడేందుకు ప్రత్యేక నిఘా చర్యలు తీసుకున్నారు.
పరీక్షల నిర్వహణకు 28,500 మంది ఇన్విజిలేటర్లు, 1,495 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, విభాగాధిపతులు నియమించబడ్డారు. అదనంగా 75 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 200 సిట్టింగ్ స్క్వాడ్లు పర్యవేక్షణ చేపట్టాయి. ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు.
గురువారం నిర్వహించనున్న సెకండ్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్-II పరీక్షకు 5,07,949 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షలు మార్చి 18 వరకు కొనసాగనున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య సదుపాయాలు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతులు కల్పించామని అధికారులు తెలిపారు.
అక్కడక్కడా చిన్న చిన్న టాఫిక్ ఇబ్బందులు తప్పా,మొత్తంగా మొదటి రోజు పరీక్షలు ఎటువంటి అంతరాయం లేకుండా ప్రశాంతంగా జారుతున్నయి . ప్రభుత్వం, విద్యాశాఖ సమన్వయంతో చేపట్టిన చర్యలు ఫలితాన్నిచ్చినట్లు విద్యార్థులు, తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు.