మేడారం మహాజాతరకు వచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం వనదేవతల ఆశీస్సులు కోరుకున్నట్లు తెలిపారు. “తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో, సమాన హక్కులతో బాగుండాలని సమ్మక్క, సారలమ్మలను ప్రార్థించాం” అని కవిత పేర్కొన్నారు.
సమ్మక్క–సారలమ్మలు కాకతీయుల వంటి రాజులతో ఎదురెళ్లి పోరాడిన వనదేవతలని, తమ జాతి కోసం నిలబడి యుద్ధం చేసిన వీరవనితలని ఆమె గుర్తు చేశారు. గోవింద రాజు, పడిగిద్ద రాజుల వంశంలో గొప్ప సైనిక సంప్రదాయం ఉందని, ఆ చరిత్రే నేటి తరాలకు స్ఫూర్తి అని అన్నారు. వారి ధైర్యం, త్యాగమే తమ పోరాటాలకు దారిచూపుతోందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు పూర్తయినా, ఇప్పటికీ ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలు పూర్తిస్థాయిలో అందని పరిస్థితి ఉందని కవిత విమర్శించారు. అభివృద్ధి ఫలాలు అందరికీ చేరాల్సినప్పటికీ, సామాజిక న్యాయం ఇంకా దక్కలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలు, గిరిజన వాసులు, బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ అసమానతలు తొలగేలా తెలంగాణ జాగృతి తరఫున తమ వంతు కృషి చేస్తామని కవిత స్పష్టం చేశారు. ప్రజల హక్కుల కోసం శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం కొనసాగుతుందని తెలిపారు. సమ్మక్క–సారలమ్మల స్ఫూర్తితోనే తెలంగాణ ప్రజల కోసం నిలబడతామని, ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
మేడారం జాతర ఆధ్యాత్మికతతో పాటు సామాజిక చైతన్యానికి కూడా ప్రతీకగా నిలుస్తుందని, ఈ సందర్భంగా ప్రజల ఐక్యత మరింత బలపడాలని కవిత ఆకాంక్షించారు.