హైదరాబాద్, ఫిబ్రవరి 24,2026
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) కార్మికులు జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ సమీప ధరణా చౌక్ వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టారు. “Chalo Secretariat” పిలుపులో భాగంగా నిర్వహించిన ఈ ఆందోళనలో రాష్ట్రంలోని వివిధ డిపోల నుంచి వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు.
ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో చేరుకున్న కార్మికులు నినాదాలు చేస్తూ, తమ ప్రధాన డిమాండ్లను పేర్కొంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వారు కోరారు. ముఖ్యంగా TSRTC ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, పెండింగ్ బకాయిలు చెల్లించడం వంటి అంశాలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
JAC నాయకులు మాట్లాడుతూ, ఈ పోరాటం ఆర్టీసీ సంస్థను కాపాడుకోవడానికే కాకుండా ఉద్యోగుల హక్కులు, గౌరవం, జీవనోపాధిని రక్షించుకునేందుకని తెలిపారు. వేలాది కుటుంబాలు ఆర్టీసీపై ఆధారపడి జీవిస్తున్నాయని, వారి సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని విజ్ఞప్తి చేశారు. ఈ ఆందోళన గాంధేయ మార్గంలో శాంతియుతంగా నిర్వహిస్తున్నామని, ప్రజాస్వామ్య హక్కుగా నిరసన తెలిపే తమ హక్కును పోలీసులు అడ్డుకోరాదని యూనియన్ ప్రతినిధులు కోరారు.
ఇదిలా ఉండగా, గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ, ఇప్పటికీ ‘Appointed Day’ ప్రకటించలేదని జేఏసీ ఆరోపించింది. పలు ఆర్థిక ప్రయోజనాలు, బకాయిలు కూడా పెండింగ్లోనే ఉన్నాయని పేర్కొంది. అదేవిధంగా ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరించాలన్న హామీపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం పట్ల కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
నిరసన నేపథ్యంలో ధరణా చౌక్ పరిసర ప్రాంతాలు, కీలక ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగానే కొనసాగింది.