‘ధందా’తో సంచలనం సృష్టించిన ఆదిత్య
ధందా’ అంటే Gen Z మాస్… మైక్రోడ్రామా తీయడం సినిమాల కంటే కష్టం: దర్శకుడు ఆదిత్య దేవులపల్లి
చై షాట్స్ నిర్మించిన వర్టికల్ స్టోరీటెల్లింగ్ సిరీస్ ‘ధందా’ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. వేగవంతమైన కథనం, కొత్త తరహా మేకింగ్, బలమైన పాత్రలతో ఈ సిరీస్ సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఆదిత్య దేవులపల్లి తన సినీ ప్రయాణం, ‘ధందా’ రూపకల్పన, మైక్రోడ్రామాల సవాళ్లు, భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
సినిమాలపై ప్రేమతో ఇంజినీరింగ్కు గుడ్బై
చదువులో టాపర్ అయినప్పటికీ చిన్నప్పటి నుంచే సినిమాలంటే అమితమైన ఆసక్తి ఉండేదని ఆదిత్య చెప్పారు. ఆ అభిరుచితోనే ఇంజినీరింగ్ను మధ్యలోనే వదిలేశానని తెలిపారు. కుటుంబ సభ్యులు కొనిచ్చిన చిన్న కెమెరాతో ఫోటోగ్రఫీ నేర్చుకుని, మాస్ కమ్యూనికేషన్ చదివానని చెప్పారు. సెయింట్ మేరీస్ కాలేజీలో తన అధ్యాపకుడు అమృత్ ద్వారా ప్రపంచ సినీ ప్రపంచాన్ని తెలుసుకున్నానని, తర్వాత జర్నలిజంలో పనిచేస్తూ పరిశ్రమలో పరిచయాలు ఏర్పరుచుకున్నానని వెల్లడించారు.
చై షాట్స్లోకి ఎలా వచ్చారు?
తాను రాసిన ఓ కథను చై బిస్కెట్కు చెందిన అనురాగ్కు వినిపించగా ఆయనకు బాగా నచ్చిందని చెప్పారు. తర్వాత చై షాట్స్లో క్రియేటివ్ ప్రొడ్యూసర్గా చేరి పలు ప్రాజెక్టులపై పనిచేశానని, కానీ ఒక దశలో దర్శకత్వం చేయాలనే కోరిక పెరగడంతో ‘ధందా’కి శ్రీకారం చుట్టానని తెలిపారు.
‘ధందా’ కథను పూర్తిగా మలిచాను
‘ధందా’ ఒరిజినల్ కథ విజయ్ కుమార్ రాసినప్పటికీ, దానిలో దాదాపు 40 శాతం మార్పులు చేశానని ఆదిత్య చెప్పారు. ముఖ్యంగా గణేష్ ఠాకూర్, అరవింద్, ప్రకాష్ ఠాకూర్ పాత్రల బ్యాక్స్టోరీలను తిరిగి రూపొందించి కథను మరింత బలంగా తీర్చిదిద్దామని తెలిపారు.
‘ధందా’కు ఒక్క నెగటివ్ రివ్యూ కూడా రాలేదు
సిరీస్ విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
“ఇప్పటివరకు ‘ధందా’కి పూర్తిగా నెగటివ్ రివ్యూ ఒక్కటీ రాలేదు. మేకింగ్, కథనం, మ్యూజిక్ అన్నింటినీ ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ప్రముఖుల నుంచి కూడా అనురాగ్కు అభినందనల ఫోన్లు వస్తున్నాయి.”
నా కథ కాకుండా ‘ధందా’నే ఎందుకు ఎంచుకున్నా?
పూరి జగన్నాథ్, రామ్ గోపాల్ వర్మ, ఉపేంద్ర వంటి దర్శకులు తనకు స్ఫూర్తి అని చెప్పిన ఆదిత్య, చై షాట్స్లో వందలాది కథలు విన్నప్పటికీ ‘ధందా’లో తన స్టైల్ కనిపించిందన్నారు.
“విజయ్ అద్భుతమైన కథ రాశాడు. దాన్ని నా శైలిలో తీర్చిదిద్దాను. వర్టికల్ కంటెంట్లో సినిమాటిక్ అనుభూతి తీసుకురావాలనేదే నా లక్ష్యం.”

“మైక్రోడ్రామా తీయడం సినిమాల కంటే కష్టం”
మైక్రోడ్రామాల గురించి మాట్లాడుతూ ఆదిత్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“సినిమాల్లో ఇంటర్వెల్, క్లైమాక్స్ల్లో మాత్రమే హైస్ ఉంటాయి. కానీ మైక్రోడ్రామాలో ప్రతి సీన్ క్లైమాక్స్లా ఉండాలి. ఒక్క సెకన్ కూడా బోర్ కొట్టకూడదు. అందుకే మైక్రోడ్రామా తీయడం సినిమాల కంటే చాలా కష్టం.”
అంతేకాదు…
“సినిమాల్లో విజయవంతమైన దర్శకుల్లో 80 శాతం మంది కూడా మైక్రోడ్రామా తీయాలంటే ఇబ్బంది పడొచ్చు.”
డోరా సాయి తేజపై ప్రశంసలు
అరవింద్ పాత్రకు పలువురిని పరిశీలించిన తర్వాత డోరా సాయి తేజను ఎంపిక చేశానని చెప్పారు.
“తేజ కథ విన్న వెంటనే మార్కెటింగ్, బిజినెస్ గురించి మాట్లాడాడు. అతనికి చాలా క్లారిటీ ఉంది. నాపై పూర్తిగా నమ్మకం పెట్టుకుని 1000 శాతం కష్టపడ్డాడు.”
28వ ఎపిసోడ్లోని మోనోలాగ్ను ఒక్క టేక్లో పూర్తి చేశాడని, భవిష్యత్తులో అతను టాలీవుడ్ స్టార్ అవుతాడని ధీమా వ్యక్తం చేశారు.
రాజమౌళి గారి క్యామియోపై క్లారిటీ
రాజమౌళి గారి క్యామియోపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ…
“రాజమౌళి సర్ లెజెండ్. ఆయనతో పని చేయాలన్న కోరిక ఉంది. కానీ నేరుగా కలిసే అవకాశం లేకపోవడంతో ఆయన చేసిన సైబర్ క్రైమ్ అవేర్నెస్ వీడియోను ట్రిబ్యూట్గా ఉపయోగించాం.”
వినోదంతో పాటు అవగాహన కూడా
‘ధందా’ ప్రధానంగా వినోదం కోసం రూపొందించినప్పటికీ, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచాలనే ఉద్దేశం కూడా ఉందని చెప్పారు.
“ఒక OTP చెప్పడం వల్లే లక్షలు, కోట్లు పోతున్నాయి. అలాంటి సైబర్ నేరాల అసలు రూపాన్ని వినోదాత్మకంగా చూపించాలనుకున్నాం.”
‘ధందా’ అంటే Gen Z మాస్
సిరీస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే…
“Gen Z మాస్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ‘ధందా’ చూడాలి. మైక్రోడ్రామాలను తక్కువ అంచనా వేసి చూడండి… ఈ సిరీస్ మీ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తుంది.”
తదుపరి ప్రాజెక్ట్
ప్రస్తుతం 50 ఏళ్ల క్రిమినల్ చుట్టూ తిరిగే కొత్త కథను రాస్తున్నానని, మరో రెండు మూడు నెలల్లో అధికారిక ప్రకటన ఉంటుందని ఆదిత్య వెల్లడించారు.
