‘కార్మేని సెల్వం’ ట్రైలర్ లాంచ్: ఈఎమ్ఐలపై ఆలోచింపజేసే మిడిల్ క్లాస్ కథ – సముద్రఖని
‘కార్మేని సెల్వం’ సినిమా చూసి ఈఎమ్ఐలను తగ్గించుకోవాలనుకుంటారు అని ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో విలక్షణ నటుడు సముద్రఖని అన్నారు. మధ్యతరగతి కుటుంబాల జీవితాన్ని ప్రతిబింబించే ఈ చిత్రం ప్రేక్షకులను ఆలోచింపజేస్తుందని తెలిపారు.
Thank you for reading this post, don't forget to subscribe!
పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా, రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తుండగా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మీ ప్రియా, అభినయ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న గ్రాండ్గా విడుదల కానుంది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా థియేటర్లలోకి రాబోతుంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా, తాజాగా విడుదలైన ట్రైలర్ ఫ్యామిలీ ఎమోషన్స్తో మరింత ఆకట్టుకుంటోంది. ప్రస్తుత ట్రెండ్కు అనుగుణంగా మిడిల్ క్లాస్ జీవితాన్ని చూపిస్తూ అంచనాలు పెంచుతోంది.
హైదరాబాద్లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు దర్శకులు శివ ప్రసాద్, ధనరాజ్, తేజ కాకుమాను అతిథులుగా హాజరయ్యారు. వారు సినిమా మిడిల్ క్లాస్ కుటుంబాలకు బాగా కనెక్ట్ అవుతుందని అభిప్రాయపడ్డారు.
సముద్రఖని మాట్లాడుతూ, “మన జీవితాన్ని చూసే విధానాన్ని విభిన్నంగా చూపించబోతున్నాం. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ప్రేక్షకుడు తన జీవితంపై ఆలోచిస్తాడు. ముఖ్యంగా లోన్స్, ఈఎమ్ఐల భారం తగ్గించుకోవాలనే భావన కలుగుతుంది. మనపై ఉన్న బరువులను తగ్గించుకుంటేనే మన కలలు నెరవేరుతాయి” అని అన్నారు.
దర్శకుడు రామ్ చక్రి మాట్లాడుతూ, “ఇది ప్రతి మధ్యతరగతి కుటుంబానికి కనెక్ట్ అయ్యే సినిమా. ప్రేక్షకులు తమ అప్పులను తగ్గించుకుని ఆనందంగా జీవించాలని ఈ చిత్రం ద్వారా సందేశం ఇవ్వబోతున్నాం” అని చెప్పారు.
నిర్మాత అరుణ్ రంగరాజులు, నటీమణులు అభినయ, లక్ష్మిప్రియా కూడా ఈ చిత్రంపై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రం ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
