BCCI హై-పర్ఫార్మెన్స్ క్యాంప్కు హైదరాబాద్కు చెందిన ఇద్దరు మహిళా క్రికెటర్ల ఎంపిక
హైదరాబాద్: బీసీసీఐ (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) నిర్వహించే ఎమర్జింగ్ అండర్-23 మహిళల హై-పర్ఫార్మెన్స్ క్యాంప్-2026కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)కు చెందిన ఇద్దరు యువ క్రికెటర్లు ఎంపికయ్యారు. ఈ మేరకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ క్రికెట్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు లేఖ పంపారు.
ఆల్ ఇండియా ఉమెన్స్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసిన జాబితాలో కేసరి ధృతి (Kesari Dhriti), మమత మదివాల (Mamtha Madiwala) చోటు దక్కించుకున్నారు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జూలై 13 నుంచి ఆగస్టు 6 వరకు ఈ క్యాంప్ నిర్వహించనున్నారు. ఎంపికైన ఆటగాళ్లు జూలై 12 మధ్యాహ్నం నాటికి బెంగళూరులో రిపోర్ట్ చేయాలని బీసీసీఐ సూచించింది.
క్యాంప్కు హాజరయ్యే ఆటగాళ్లకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. స్టాండింగ్ లాంగ్ జంప్, 10 మీటర్లు, 20 మీటర్లు, 40 మీటర్ల స్ప్రింట్, రన్-ఏ-3, యో-యో టెస్ట్, డెక్సా స్కాన్ వంటి పరీక్షల్లో నిర్దేశిత ప్రమాణాలను చేరుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన క్రీడాకారిణులు ఫిట్గా ఉన్నట్లు రాష్ట్ర ఫిజియో, వైద్యుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని బీసీసీఐ పేర్కొంది.
క్యాంప్కు సంబంధించిన మార్గదర్శకాలపై ఎంపికైన ఆటగాళ్లు, వారి స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్లతో బీసీసీఐ స్పోర్ట్స్ సైన్స్ టీమ్ ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించనుంది. క్యాంప్లో పాల్గొనే క్రీడాకారిణులకు శిక్షణ దుస్తులు అందించనున్న బీసీసీఐ, వ్యక్తిగత క్రికెట్ సామగ్రిని వెంట తీసుకురావాలని సూచించింది.
జాతీయ స్థాయి హై-పర్ఫార్మెన్స్ క్యాంప్కు హైదరాబాద్కు చెందిన ఇద్దరు మహిళా క్రికెటర్లు ఎంపిక కావడం స్థానిక క్రికెట్ వర్గాల్లో ఆనందాన్ని నింపింది.
BCCI CoE Invites Hyderabad Players for Emerging U-23 Women’s Camp
