హైదరాబాద్: తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పోలీసు కంప్యూటర్ సర్వీసెస్ (PCS), హైదరాబాద్లో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) సంకిరెడ్డి భీమ్రెడ్డిపై అక్రమాస్తుల (Disproportionate Assets) కేసు నమోదు చేసింది. ఆయన సేవాకాలంలో తెలిసిన ఆదాయ వనరులకు మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో గురువారం రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.
డీఎస్పీ నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీలు, సన్నిహితులకు చెందిన మొత్తం 15 ఇతర ప్రాంగణాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలు లభించినట్లు అధికారులు వెల్లడించారు.
ఏసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంబాగ్లోని వెస్సెల్లా మెడోస్లో విల్లా, టెలికాం నగర్లో గ్రౌండ్ ప్లస్ రెండు అంతస్తుల భవనం, పెంట్హౌస్, ఒక ఫ్లాట్, గచ్చిబౌలిలో మరో ఫ్లాట్, తెల్లాపూర్లో రెండు ఫ్లాట్లు, మణికొండలో వాణిజ్య ఆస్తులు, హైదరాబాద్, పటాన్చెరు, వికారాబాద్ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు, సంగారెడ్డి జిల్లాతో పాటు కర్ణాటకలో వ్యవసాయ భూములు, బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో ఒక ఎకరం భూమికి సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
అదనంగా, రాక్ శాండ్ మినరల్స్ సంస్థలో రూ.75 లక్షల పెట్టుబడికి సంబంధించిన పత్రాలు కూడా గుర్తించినట్లు ఏసీబీ తెలిపింది.
సోదాల్లో భాగంగా సుమారు రూ.43.60 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో డీఎస్పీ నివాసం నుంచి రూ.3.60 లక్షలు, ఓ బినామీ ఇంటి నుంచి రూ.40 లక్షలు లభించినట్లు వెల్లడించారు. అలాగే సుమారు రెండు కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులు, దాదాపు రూ.19.91 లక్షల బ్యాంకు నిల్వలను కూడా గుర్తించారు.
స్వాధీనం చేసుకున్న స్థిరాస్తుల మార్కెట్ విలువ రిజిస్ట్రేషన్ విలువ కంటే అనేక రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
అదేవిధంగా డీఎస్పీ నివాసంలో 23 విదేశీ మద్యం సీసాలు లభించగా, వాటిపై తదుపరి చర్యల కోసం ఎక్సైజ్ శాఖకు సమాచారం అందించినట్లు తెలిపారు.
ఇంకా ఇతర ఆస్తులకు సంబంధించిన వివరాల పరిశీలన కొనసాగుతోందని, అక్రమాస్తుల కేసుపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలంగాణ ఏసీబీ వెల్లడించింది.
ACB raids Telangana DSP’s properties in disproportionate assets case.
