హైదరాబాద్, మార్చి 18:
హైదరాబాద్లో సంచలనం సృష్టించిన రూ.1 కోటి దోపిడీ కేసును కూకట్పల్లి కేవలం 24 గంటల్లో ఛేదించారు. సినీ స్టైల్లో ప్లాన్ చేసి, మిర్చి పొడి ఉపయోగించి డబ్బు దోచుకున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది.
బాధితుడు మహ్మద్ అజీముద్దీన్ అనే వ్యక్తి. అతను సహచరుడితో కలిసి హవాలా డబ్బు సేకరించి బైక్పై తరలిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు ఖుస్రుద్దీన్ ఈ వ్యవహారంపై ముందుగానే సమాచారం తెలుసుకొని, డబ్బు దోచుకునే కుట్ర పన్నాడు.
మార్చి 17న బాధితులు కూకట్పల్లిలో రూ.1 కోటి నగదు సేకరించి బైక్పై బయలుదేరారు. వారి కదలికలను ముందుగానే గమనించిన నిందితులు మూడు బైక్లపై వెంబడించారు. పిలర్ నంబర్ 836 వద్ద బాధితులపై మిర్చి పొడి చల్లి దాడి చేశారు. దీంతో బైక్ అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. అదే సమయంలో నిందితులు డబ్బుతో కూడిన బ్యాగ్ను లాక్కొని పరారయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన స్థలంలో వదిలివేసిన వాహనం ఆధారంగా నిందితుల వివరాలను గుర్తించారు. అనంతరం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో లక్నోకు పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు వారి వద్ద నుంచి రూ.77 లక్షలకు పైగా నగదు, మొబైల్ ఫోన్లు, వాహనం మరియు విమాన టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిందితులు పరారీలో ఉండగా, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
ఈ కేసును వేగంగా ఛేదించిన కూకట్పల్లి పోలీసులు మరియు సీసీఎస్ బలానగర్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. నగరంలో నేరాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.
