Thank you for reading this post, don't forget to subscribe!
MUSI INVITES కార్యక్రమంలో ముఖ్యమంత్రి పిలుపు – అభివృద్ధిని అడ్డుకోవద్దని విజ్ఞప్తి
Hyderabad:మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమంపై ప్రజల్లో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని, అభివృద్ధిని అడ్డుకోవడం సమస్యకు పరిష్కారం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. “MUSI INVITES” కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కొందరు ఉద్దేశపూర్వకంగా మరియు మరికొందరు అసంపూర్ణ సమాచారంతో అర్ధసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వం అధికారాన్ని ప్రజలపై ఆధిపత్యం కోసం కాకుండా కాపలాదారుగా వినియోగిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకే ముఖ్యమంత్రిగా బాధ్యతతో ఈ కార్యక్రమం ద్వారా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. మానవ నాగరికత నదుల చుట్టూనే అభివృద్ధి చెందిందని, ప్రపంచ దేశాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నప్పుడు మనం వెనుకబడితే భవిష్యత్ తరాలు మనలను క్షమించవని వ్యాఖ్యానించారు.
మూసీ నది, హైదరాబాద్ నగరానికి గొప్ప చరిత్ర ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. 1908లో మూసీ వరదలు నగరాన్ని ముంచెత్తిన నేపథ్యంలో ఆ సమయంలో Engineer Mokshagundam Visvesvaraya సలహాలతో నిజాం పాలకులు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లను నిర్మించారని తెలిపారు. ఆ రిజర్వాయర్లు వందేళ్లుగా నగరాన్ని వరద ముప్పు నుంచి కాపాడడమే కాకుండా ప్రజల తాగునీటి అవసరాలను తీర్చుతున్నాయని చెప్పారు.
అంత గొప్ప వారసత్వ సంపద కలిగిన హైదరాబాద్ నగరాన్ని నిర్లక్ష్యం చేయలేమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన వారు మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఏదైనా లోపాలు ఉంటే సూచనలు చేయాలని, కానీ అభివృద్ధిని అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
మూసీ నది ప్రస్తుతం కాలుష్యంతో విషతుల్యంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లాలో పుట్టిన మూసీ నది హైదరాబాద్ చేరేసరికి పూర్తిగా కాలుష్యమయంగా మారుతోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నదిని పునరుద్ధరించడం కేవలం అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాకుండా మన సంస్కృతి, చరిత్రను కాపాడుకునే బాధ్యతగా భావించాలని సూచించారు.
మూసీ పరివాహక ప్రాంతంలో బుల్డోజర్లు తీసుకెళ్తున్నారని కొందరు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే ఎవరి ఆస్తులను గుంజుకోవడం ప్రభుత్వ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. పేదలకు మౌలిక సదుపాయాలు కల్పించడం, ఉపాధి అవకాశాలు పెంచడం, పర్యాటకాభివృద్ధి మరియు నైట్ ఎకానమీని ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో ఈ ప్రాజెక్టును చేపట్టామని చెప్పారు.
మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న నిరాశ్రయుల పూర్తి వివరాలు ప్రభుత్వానికి ఉన్నాయని, వారికి ఇండ్లు నిర్మించి పునరావాసం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. స్కూళ్లు, ఇతర సౌకర్యాలు అందించడంతో పాటు ఆ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా కల్పించనున్నామని చెప్పారు.
ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తోందని, నగర అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పేదలను నిరాశ్రయులను చేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని స్పష్టం చేసిన సీఎం, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు భవిష్యత్ తరాల కోసం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమమని తెలిపారు.
అందరి సూచనలు, సలహాలు స్వాగతమని, సహకారంతో ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
