Thank you for reading this post, don't forget to subscribe!

ప్రజలకు నష్టం లేకుండా అభివృద్ధి సాధ్యమే… ₹16,000 కోట్లతో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశాం: BRS party Working President KTR

Hyderabad: మూసి నది అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ భూసేకరణకు ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తీవ్ర ఆరోపణలు చేశారు. హిమాయత్ సాగర్ వద్ద నిర్వహించిన మూసి పునరుజ్జీవం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వర్సెస్ పబ్లిక్ పాయింట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మూసి అభివృద్ధికి తమ పార్టీ వ్యతిరేకం కాదని, కానీ ప్రజల ఇళ్లను కూల్చి వేల కోట్ల అవినీతికి దారితీసే ప్రణాళికను మాత్రం అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ₹16,000 కోట్లతో సమగ్ర ప్రణాళికను రూపొందించి, ఒక్క ఇంటిని కూడా కూల్చకుండా మూసిని అభివృద్ధి చేసే మార్గాన్ని చూపిందని కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే ఉప్పల్, నాగోల్ ప్రాంతాల్లో సుమారు 6 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తయ్యాయని ఆయన గుర్తు చేశారు. ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా మూసిని అందంగా మార్చవచ్చని తమ ప్రభుత్వం నిరూపించిందన్నారు.
కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం లక్షన్నర కోట్ల రూపాయల అంచనాలతో మూసి ప్రాజెక్టును ముందుకు తీసుకువస్తూ వేలమంది ఇళ్లను కూల్చివేయాలని చూస్తోందని కేటీఆర్ విమర్శించారు. ఎలాంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు, సోషల్ ఇంపాక్ట్ స్టడీ, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ స్టడీ లేకుండానే ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారని అన్నారు.
మూసి పేరుతో 3,300 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఆ భూముల విలువ సుమారు ₹1.5 లక్షల కోట్లకు పైగా ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు అసలు ఉద్దేశం మూసి అభివృద్ధి కాదని, మూసి పక్కన ఉన్న భూములపై కన్నేసిన రియల్ ఎస్టేట్ ప్రయోజనాలేనని ఆరోపించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూసిలో మురికిని పూర్తిగా నివారించేందుకు ఎస్టీపీలు నిర్మించడానికి ₹3,800 కోట్లతో పనులు ప్రారంభించిందని, అవి పూర్తయితే ఒక్క చుక్క మురికి నీరు కూడా మూసిలోకి వెళ్లదన్నారు. అలాగే ఓఆర్ఆర్ నుంచి ఓఆర్ఆర్ వరకు ఎక్స్ప్రెస్ వే, వాక్వేలు, సైక్లింగ్ ట్రాక్లు, పార్కులు వంటి అభివృద్ధి పనులను ప్రణాళికలో భాగం చేశామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని మూసిలోకి తీసుకురావడానికి కూడా ప్రణాళిక రూపొందించామని వివరించారు.
దేశవ్యాప్తంగా గంగా నది శుద్ధి కోసం చేపట్టిన నమామి గంగే ప్రాజెక్టు వందల కిలోమీటర్లకు కేవలం ₹42 వేల కోట్లు ఖర్చయితే, కేవలం 55 కిలోమీటర్ల మూసి అభివృద్ధికి ₹1.5 లక్షల కోట్లు ఎందుకు అవసరమవుతుందో ప్రభుత్వం చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు.
అభివృద్ధికి తమ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని, కానీ ప్రజల ఇళ్లను కూల్చి అవినీతి ప్రణాళికలు అమలు చేయాలని చూస్తే బీఆర్ఎస్ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. మూసి బాధితుల వెంట తమ పార్టీ నిలుస్తుందని, అవసరమైతే హైదరాబాద్ ప్రజలతో కలిసి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు వివేకానంద గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి, శంభీపూర్ రాజు, స్వామి గౌడ్, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మూసి ప్రభావిత ప్రాంతాల నివాసితులు కూడా తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ప్రజల జీవనోపాధిని దెబ్బతీయకూడదని కోరారు.
