Friday, April 17, 2026
HomeHyderabadIPL బెట్టింగ్ ముఠాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ V. C. Sajjanar తీవ్ర హెచ్చరిక

IPL బెట్టింగ్ ముఠాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ V. C. Sajjanar తీవ్ర హెచ్చరిక

  హైదరాబాద్: ఐపీఎల్ క్రికెట్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో నగరంలో క్రికెట్ బెట్టింగ్ ముఠాల కార్యకలాపాలు పెరుగుతున్నాయని గమనించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ V. C. Sajjanar తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. క్రికెట్‌ను జూదంగా మార్చి అమాయక ప్రజల జీవితాలతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నగరంలో ఎక్కడైనా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తేలితే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలతో పాటు పీడీ యాక్ట్ కూడా అమలు చేస్తామని హెచ్చరించారు. గతంలో నిర్వహించిన #SayNoToBettingApps […]

 

హైదరాబాద్: ఐపీఎల్ క్రికెట్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో నగరంలో క్రికెట్ బెట్టింగ్ ముఠాల కార్యకలాపాలు పెరుగుతున్నాయని గమనించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ V. C. Sajjanar తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. క్రికెట్‌ను జూదంగా మార్చి అమాయక ప్రజల జీవితాలతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నగరంలో ఎక్కడైనా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తేలితే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలతో పాటు పీడీ యాక్ట్ కూడా అమలు చేస్తామని హెచ్చరించారు.

గతంలో నిర్వహించిన #SayNoToBettingApps ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, దీని ఫలితంగా కేంద్ర ప్రభుత్వం వందలాది బెట్టింగ్ యాప్‌లను నిషేధించడంతో పాటు కఠినమైన ఆన్‌లైన్ గేమింగ్ చట్టాల దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. అయినప్పటికీ, మోసగాళ్లు కొత్త మార్గాలను ఎంచుకుని తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని చెప్పారు.

ప్రస్తుతం టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కొత్త వెబ్‌సైట్లు సృష్టించి ప్రజలను మోసం చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఈ యాప్‌లు లేకపోయినా, గోప్యంగా లింకులు పంపుతూ యువతను బెట్టింగ్‌లోకి దింపుతున్నారని వెల్లడించారు. అంతేకాకుండా, నివాస గృహాలు, ఫామ్ హౌస్‌లు మరియు ఇతర రహస్య ప్రదేశాల్లో గుంపులుగా చేరి మొబైల్ ఫోన్ల ద్వారా ఆఫ్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు.

స్థానిక బుకీలు యువతను లక్ష్యంగా చేసుకుని తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపుతూ వారిని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని కమిషనర్ పేర్కొన్నారు. ఒకసారి ఈ వ్యసనానికి బానిసలైతే బయటపడటం కష్టమవుతుందని, చివరికి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

“బెట్టింగ్‌లో గెలిచేది కేవలం నిర్వాహకులే. ఆడేవారు మాత్రం తమ సర్వస్వాన్ని కోల్పోతారు” అని ఆయన స్పష్టం చేశారు. క్రికెట్‌ను ఒక క్రీడగా ఆస్వాదించాలని, దానిని జూదంగా మార్చుకోవడం వల్ల జీవితాలు నాశనం అవుతాయని సూచించారు.

నగరాన్ని, ముఖ్యంగా యువతను ఈ బెట్టింగ్ భూతం నుంచి కాపాడుకోవడం అందరి బాధ్యత అని పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు. పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిసినా, లేదా మిమ్మల్ని ఎవరైనా వేధిస్తున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

సందేహాస్పద కార్యకలాపాలపై వెంటనే స్పందించేందుకు డయల్ 100కు కాల్ చేయాలని, అలాగే హైదరాబాద్ పోలీస్ వాట్సాప్ నంబర్ 94906 16555 కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల సహకారంతోనే బెట్టింగ్ ముఠాలపై పూర్తి స్థాయిలో నియంత్రణ సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories