హైదరాబాద్: ఈ నెల 22న హైదరాబాద్లో జరగనున్న Sunrisers Hyderabad (SRH) – Royal Challengers Bengaluru (RCB) ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మల్కాజిగిరి పోలీసులు హెచ్చరించారు.
ఐపీఎల్ మ్యాచ్లకు ఉన్న భారీ డిమాండ్ను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు నకిలీ టికెట్ బుకింగ్ వెబ్సైట్లు, డూప్లికేట్ యాప్లు సృష్టించి ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్), ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ఫేక్ బుకింగ్ లింకులను షేర్ చేస్తూ ప్రజలను ఉచ్చులోకి దింపుతున్నారని వెల్లడించారు.
“VIP”, “Tatkal”, “Last Minute”, “Discount” టికెట్లు అంటూ ఆకర్షణీయ ఆఫర్లు చూపిస్తూ యూపీఐ, క్యూ ఆర్ కోడ్లు, బ్యాంక్ ట్రాన్స్ఫర్లు, నకిలీ పేమెంట్ గేట్వేల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. చెల్లింపులు చేసిన తర్వాత ఫేక్ స్క్రీన్షాట్లు, నకిలీ బుకింగ్ కన్ఫర్మేషన్లు పంపించి మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
ఐపీఎల్ మ్యాచ్కు అధికారిక టికెట్ బుకింగ్ మరియు రిజిస్ట్రేషన్ వేదిక కేవలం జొమాటోకు చెందిన “District App” మాత్రమేనని పోలీసులు స్పష్టం చేశారు. తెలియని వెబ్సైట్లు, అనధికార లింకులు, సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.
చెల్లింపులు చేసే ముందు వెబ్సైట్ అసలుదనాన్ని తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని, అధికారిక ప్లాట్ఫామ్లు మరియు అనుమతి పొందిన యాప్ల ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని మల్కాజిగిరి పోలీసులు సూచించారు.
ఆన్లైన్ టికెట్ మోసాలు, ఫిషింగ్ కార్యకలాపాలపై సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు వెల్లడించిన అధికారులు, ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Beware of Fake IPL Tickets, Warn Malkajgiri Police Ahead of SRH-RCB Match

