టీజీ ఈఏపీసెట్ టాపర్ ఎం. రుషిని సన్మానించిన Chiranjeevi.. ల్యాప్టాప్ బహుమతి
మెగాస్టార్ చిరంజీవి గారు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. సేవా కార్యక్రమాలు, సహాయ సహకారాలతో ఎప్పుడూ ముందుండే ఆయన, టీజీ ఈఏపీసెట్ 2026లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించిన రెజోనెన్స్ జూనియర్ కాలేజీ విద్యార్థిని ఎం. రుషిని ప్రత్యేకంగా అభినందించారు.
రుషి సాధించిన ఈ అద్భుత విజయాన్ని ప్రశంసించిన చిరంజీవి గారు ఆమె కష్టపడి చదివిన తీరు, పట్టుదల, అంకితభావాన్ని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశీర్వదించారు.
చిరంజీవిని కలవడం రుషి చిన్ననాటి కల. మంచి ర్యాంక్ సాధిస్తే చిరంజీవిని కలిపిస్తామని ఆమె తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఆ కల నిజం కావడంతో రుషి కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవిని కలిసింది. ఈ సందర్భంగా ఆమె ప్రతిభకు గుర్తింపుగా చిరంజీవి గారు ల్యాప్టాప్ను బహుమతిగా అందించారు.
రుషి భవిష్యత్తులో ఇంజినీరింగ్ చదివి ఐఏఎస్ అధికారి కావాలనే లక్ష్యాన్ని తెలుసుకున్న చిరంజీవి గారు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. “ఏ అవసరం వచ్చినా సంకోచించకుండా చెప్పండి. నన్ను కుటుంబ సభ్యుడిగా భావించండి. అమ్మాయి తన కలలను నిజం చేసుకునేలా ప్రోత్సహించండి,” అంటూ రుషి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా రెజోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణ చంద్రరావు నార్రా మాట్లాడుతూ, “ఎం. రుషి సాధించిన విజయం కేవలం ఒక ర్యాంక్ మాత్రమే కాదు, ఇది చరిత్రాత్మక మైలురాయి. ముఖ్యంగా అమ్మాయిలకు ఇది గొప్ప ప్రేరణ. మా విద్యార్థిని విజయాన్ని మెగాస్టార్ చిరంజీవి గారు అభినందించడం మాకు ఎంతో గర్వకారణం,” అన్నారు.
1986లో ప్రారంభమైన ఈఏఎంసెట్ పరీక్ష తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షలలో ఒకటిగా కొనసాగుతోంది. తరువాత ఇది ఈఏపీసెట్గా మారింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా అబ్బాయిలే టాప్ ర్యాంకులు సాధిస్తూ వచ్చిన నేపథ్యంలో, ఎం. రుషి టీజీ ఈఏపీసెట్లో స్టేట్ ఫస్ట్ సాధించిన తొలి అమ్మాయిగా చరిత్ర సృష్టించింది.
రుషి విజయం రెజోనెన్స్ జూనియర్ కాలేజీ, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలవడంతో పాటు, భవిష్యత్ తరాల విద్యార్థులకు స్ఫూర్తిగా మారింది.
