హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో మంగళ్హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున భారీ స్థాయిలో “Community Contact Program” (నేర నియంత్రణ తనిఖీలు) నిర్వహించారు. గోల్కొండ జోన్ పరిధిలో చేపట్టిన ఈ ప్రత్యేక తనిఖీలు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు కట్టుదిట్టంగా సాగాయి.
పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని గోల్కొండ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జి. చంద్ర మోహన్ పర్యవేక్షించారు. ఆయనతో పాటు అడిషనల్ డీసీపీ బి. కృష్ణ గౌడ్, గోషామహల్ ఏసీపీ ఎస్. సుదర్శన్, కుల్సుంపురా ఏసీపీ వి. తిరుపతి, మంగళ్హాట్ ఇన్స్పెక్టర్ ఎస్. రాఘవేంద్ర, అడిషనల్ ఇన్స్పెక్టర్ పి. మహేందర్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం 184 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొనడం విశేషం.
మంగళ్హాట్ పరిధిలోని కీలక ప్రాంతాలైన జుమ్రాత్ బజార్లో లాలాభవన్ నుంచి రాహుల్ ఫుట్వేర్ వరకు, లాలాభవన్ నుంచి కున్నా పాన్ షాప్ వరకు, లాలా తాలీమ్ నుంచి టక్కర్వాడి వరకు, అలాగే బుధే బాబా హనుమాన్ దేవాలయం పరిసరాలు, లోయర్ ధూల్పేట్ ప్రాంతాల్లో ఇంటింటి సోదాలు, వ్యక్తుల ధృవీకరణలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ తనిఖీలలో పలు నిబంధనల ఉల్లంఘనలు బయటపడ్డాయి. సరైన పత్రాలు లేని 28 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా సుమారు 49.4 లీటర్ల అక్రమ మద్యం (విస్కీ, బీరు)ను సీజ్ చేశారు. గ్యాస్ సిలిండర్ల అక్రమ వినియోగం కూడా బయటపడింది. 22 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు, 12 గృహ అవసరాల సిలిండర్లు, 79 చిన్న సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన ప్రకారం, ఈ కార్యక్రమం పూర్తిగా క్రమశిక్షణతో, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించబడింది. ముఖ్యంగా స్థానిక ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం, నేరాలను అరికట్టడం, అసాంఘిక శక్తులపై నిఘా పెంచడం లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు.
గోల్కొండ జోన్ డీసీపీ జి. చంద్ర మోహన్ మాట్లాడుతూ, “ఇలాంటి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్లను తరచూ నిర్వహిస్తూ ప్రజల సహకారంతో నేరాలను నియంత్రించడానికి కట్టుబడి ఉన్నాం” అని తెలిపారు.
పోలీసుల ఈ ఆకస్మిక తనిఖీలతో ప్రాంతంలో నేరస్తుల్లో భయం నెలకొంది. స్థానికులు కూడా పోలీసుల చర్యలను స్వాగతిస్తూ, భద్రత కోసం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని కోరుతున్నారు.
Hyderabad City police conducted “Community Contact Program” Mangalhat PS limits.
