సైబరాబాద్, జూన్ 16:
వర్షాకాలం సైబరాబాద్ లో (IT Corridor) వరదలు, నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై మల్కం చెరువు వద్ద మంగళవారం అత్యవసర సమన్వయ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధ్యక్షత వహించగా, రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, హైడ్రా కమిషనర్ రంగనాథ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో డీజీపీ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు. నీరు నిలిచే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ట్రాఫిక్ అంతరాయాలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసి, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు.
లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, రద్దీ రహదారుల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.
సమావేశం అనంతరం మల్కం చెరువు, ఖాజాగూడ లేక్ , మండికుంట, గురునాథ్ చెరువు, మియాపూర్ పరిసర ప్రాంతాలు, బయోడైవర్సిటీ జంక్షన్, కొండాపూర్ తదితర వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు ప్రత్యేక ఇంజనీరింగ్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి నీటి ప్రవాహ మార్గాలు, ఆక్రమణలు, డ్రైనేజీ అనుసంధానాలు, నీటి నిల్వలకు కారణమవుతున్న అంశాలను సమగ్రంగా పరిశీలించాయి.
తక్షణ చర్యలు అవసరమైన సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాలపై నివేదికలు సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, పోలీస్, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, హైడ్రా తదితర శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ఎక్కడా అలసత్వం లేదా నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా ప్రజల భద్రతనే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
వర్షాకాలం పూర్తయ్యే వరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, నీటి నిల్వలు, పట్టణ వరదలు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల భద్రత, సౌకర్యాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాయని డీజీపీ సి.వి. ఆనంద్ పునరుద్ఘాటించారు.
Inter-Department Coordination Crucial for Flood Prevention in Cyberabad: DGP C.V. Anand

