Hyderabad: తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపుకు నాంది పలుకుతూ కల్వకుంట్ల కవిత “తెలంగాణ రక్షణ సేన” అనే కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె, గత రెండు దశాబ్దాలుగా సామాజిక సంస్థగా కొనసాగుతున్న తెలంగాణ జాగృతి అలాగే కొనసాగుతుందని, ఇకపై ప్రజా సమస్యలపై రాజకీయ వేదికగా ఈ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలపై గళమెత్తుతూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా “పాంచజన్యం” పేరుతో ఐదు ప్రధాన అంశాలను ప్రకటించిన కవిత, ఆధర్మంపై పోరాటానికి సంకేతంగా ఈ అజెండాను రూపొందించినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కుటుంబాలు తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని విద్య, వైద్యం కోసం ఖర్చు చేస్తున్నాయని పేర్కొంటూ, ప్రైవేట్ విద్యార్థులకు కూడా ఉచిత విద్య అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. వైద్య ఖర్చులు తగ్గించేందుకు, ముఖ్యంగా క్యాన్సర్ వంటి వ్యాధులకు ఉచిత చికిత్స అందించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ, కొనుగోలు కేంద్రాల వద్ద పంటలు అమ్మలేక రైతులు పడుతున్న ఇబ్బందులను ఆమె ప్రస్తావించారు. బియ్యం ఎగుమతుల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని, రైతులకు గౌరవం, స్థిర ఆదాయం కల్పించడమే లక్ష్యమని చెప్పారు. అదే విధంగా నిరుద్యోగ సమస్యపై స్పందిస్తూ, యువతకు 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు రుణాలు అందించి స్టార్టప్లను ప్రోత్సహిస్తామని, యువత ఉద్యోగాలు పొందేవారిగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవారిగా ఎదగాలని పిలుపునిచ్చారు.
సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తామని, సామాజిక న్యాయం కింద అన్ని వర్గాల పేదలకు ఇళ్లు నిర్మించడమే కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు తగిన నిధులు కేటాయిస్తామని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, సంక్షేమ పథకాలు సరిగా అమలు కావడం లేదని, మహిళలపై నేరాలు పెరిగాయని ఆరోపించారు.
జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానమిస్తూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని, కానీ రాజకీయంగా అభిప్రాయ భేదాలు ఉన్నాయని కవిత స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగ సమస్యలు, పేపర్ లీక్ ఘటనలు యువతను తీవ్రంగా దెబ్బతీశాయని విమర్శించారు. తమ పార్టీలో మహిళలకు కనీసం 33 శాతం సీట్లు కేటాయిస్తామని, అవసరమైతే 50 శాతం వరకు పెంచుతామని తెలిపారు.
ప్రజల సమస్యలపై నిరంతర పోరాటం చేస్తామని, సర్వోదయ తెలంగాణ సాధన కోసం కట్టుబడి ఉన్నామని కవిత పేర్కొంటూ, ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రజలే తీర్పు చెబుతారని హెచ్చరించారు.
Kavitha Floats ‘Telangana Rakshana Sena’, Targets Power with Sarvodaya Agenda
