Hyderabad : హైదరాబాద్: తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆదివారం జరిగిన ప్రెస్మీట్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా అధికారులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మూసీ నది ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం పారదర్శకత లేకుండా నిర్ణయాలు తీసుకుంటోందని ఆమె ఆరోపించారు.
Thank you for reading this post, don't forget to subscribe!
హైడ్రా అధికారిగా ఉన్న రంగనాథ్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ట్విట్టర్లో వీడియోలు పెట్టి తనను బద్నాం చేస్తున్నారని కవిత అన్నారు. ఆదిత్య కన్స్ట్రక్షన్స్ అక్రమ నిర్మాణాలపై గతంలో రంగనాథ్ స్వయంగా లేఖ రాశారని గుర్తుచేసిన ఆమె, అదే విషయంపై తాను ధర్నా చేస్తే ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రోజు సాయంత్రం వరకు ఆ వీడియోలను తొలగించకపోతే డిఫమేషన్ కేసు వేస్తానని ఆమె హెచ్చరించారు.
మూసీ ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వడం లేదని కవిత విమర్శించారు. ప్రపంచ బ్యాంక్కు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ప్రాజెక్ట్ చేపడుతున్నారని గతంలోనే జాగృతి హెచ్చరించిందని తెలిపారు. ఇటీవల ఇచ్చిన ప్రజెంటేషన్లో కూడా ప్రజలకు కలిగే ప్రయోజనాలపై స్పష్టమైన వివరాలు ఇవ్వలేదని ఆమె అన్నారు.
మూసీ నది పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారని, గత ప్రభుత్వంలో రివర్ బెడ్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వలేదని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు 18 లక్షల స్క్వేర్ ఫీట్ల నిర్మాణాలకు ఎలా అనుమతి ఇచ్చారో ప్రభుత్వం ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
ప్రాజెక్ట్ ఖర్చు విషయంలో కూడా అనుమానాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. గత ఏడాది సెప్టెంబర్లో 5,641 కోట్లుగా అంచనా వేసిన ప్రాజెక్ట్ ఖర్చు, ఆరు నెలల్లోనే 6,500 నుంచి 7,000 కోట్లకు ఎలా పెరిగిందో ప్రభుత్వం చెప్పాలని కవిత ప్రశ్నించారు.
మూసీ అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తూ, పెద్దవారి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆరోపించారు. మూసీ ప్రక్షాళన నిజంగా ప్రజలకు మేలు చేసేలా ఉండాలని, ముందుగా నదిలోకి వచ్చే మురుగు నీటిని ఆపాలని సూచించారు.
వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన బాధితుల సమస్యలపై ఈ నెల 17న ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేస్తామని కవిత ప్రకటించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ జాగృతి పోరాటం కొనసాగిస్తుందని ఆమె స్పష్టం చేశారు.
