హైదరాబాద్, మార్చి 18:
మొక్కజొన్న రైతులకు మద్దతుగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) చేపట్టిన ఆందోళన హైదరాబాద్లో ఉద్రిక్తతకు దారి తీసింది. రైతులకు కనీస మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గన్పార్క్ నుంచి అసెంబ్లీ వరకు బీఆర్ఎస్ నేతలు ర్యాలీ నిర్వహించారు.
Thank you for reading this post, don't forget to subscribe!
అయితే అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద పోలీసులు, మార్షల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకున్నారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. మార్షల్స్ దురుసుగా ప్రవర్తించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. సభ్యుల చేతుల్లో ఉన్న మక్కజొన్నను బలవంతంగా లాక్కోవడం తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.
ఈ ఘటనలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావుకు గాయం కావడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది. ఆయన చేతికి గాయం అయి రక్తస్రావం కావడంతో పార్టీ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇది ప్రజాస్వామ్యమా? లేక పోలీస్ రాజ్యమా?” అంటూ అసెంబ్లీ ద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం, పోలీసుల తీరుపై బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర విమర్శలు గుప్పించారు. నినాదాలు చేస్తూనే సభలోకి ప్రవేశించిన బీఆర్ఎస్ నేతలు.
అనంతరం BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మూసీ నది ప్రాజెక్టుపై పలు కీలక ప్రశ్నలు లేవనెత్తారు.
KTR మాట్లాడుతూ, మూసీ ప్రాజెక్టు డీపీఆర్ తయారీపై అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఈ ప్రాజెక్టును రూపొందించిన కంపెనీపై ఇప్పటికే పలు దేశాల్లో నిషేధాలు ఉన్నాయని ఆరోపించారు. సాధారణంగా డీపీఆర్ తయారీకి 18 నెలలు పడుతుందని గతంలో చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు కేవలం రెండు నెలల్లో పూర్తి చేయడం ఎలా సాధ్యమైందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ADB) నుంచి రుణం విషయంలో కూడా ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని ఆరోపించారు. ఒకవైపు భారీగా రూ.1.5 లక్షల కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పి, మరోవైపు సభలో మాత్రం తక్కువ అంచనాలు చెబుతున్నారని విమర్శించారు.
భూసేకరణ, ఇళ్ల కూల్చివేత అంశాల్లో కూడా స్పష్టత లేదని, బఫర్ జోన్ విస్తరణపై కూడా ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
మొత్తంగా, రైతుల సమస్యలతో ప్రారంభమైన ఈ ఆందోళన, రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడిని రేపింది.
