Hyderabad: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, అనిల్ దంపతులు మరియు జాగృతి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Thank you for reading this post, don't forget to subscribe!
వేడుకల అనంతరం కల్వకుంట్ల కవిత రూ.2,15,200 కోట్లతో తెలంగాణ జాగృతి తరఫున “ప్రజా బడ్జెట్ 2026-27”ను విడుదల చేశారు. ప్రజల సూచనల మేరకు రూపొందించిన ఈ బడ్జెట్లో సంక్షేమం, విద్య, వైద్యం రంగాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ఇక నుంచి ప్రతి ఏడాది ఉగాది రోజున ప్రజా బడ్జెట్ ప్రవేశపెడతామని వెల్లడించారు.
ప్రజా బడ్జెట్లో విద్యారంగానికి రూ.30 వేల కోట్లు, వైద్యానికి రూ.25 వేల కోట్లు, రైతులకు మరియు కౌలు రైతులకు రూ.35 వేల కోట్లు కేటాయించారు. అలాగే పింఛన్ల కోసం రూ.25 వేల కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు రూ.20 వేల కోట్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమానికి ప్రత్యేకంగా నిధులు ప్రతిపాదించారు. యువతకు స్కూటీలు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం వంటి పథకాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, తాము తక్కువ వ్యయంతో ప్రజల సంక్షేమానికి అనుకూలంగా ఈ బడ్జెట్ రూపొందించామని కవిత పేర్కొన్నారు. ప్రభుత్వానికి అదనంగా మిగులు నిధులు ఉంటాయని కూడా ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కవిత, ప్రజల కోసం పనిచేయాలని జాగృతి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సనాతన ధర్మం గొప్పదని, సంస్కృతిని కాపాడుకోవాలని సూచించారు.
