సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని మాజీ మంత్రి, BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు (KTR) ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అసెంబ్లీలో కలిసి సిరిసిల్ల పవర్లూమ్ యూనిట్లపై ఉన్న విద్యుత్ బకాయిల సమస్యపై సమగ్ర వినతి పత్రాన్ని అందజేశారు.
Thank you for reading this post, don't forget to subscribe!
సిరిసిల్ల పట్టణం రాష్ట్ర వస్త్ర పరిశ్రమకు కీలక కేంద్రంగా నిలిచిందని, వేలాది కుటుంబాల ఉపాధి ఈ రంగంపై ఆధారపడి ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో కూడా ఆర్థిక ఇబ్బందులతో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలను గుర్తు చేస్తూ, ప్రస్తుత పరిస్థితులు మళ్లీ అలాంటి దిశగా వెళ్తున్నాయనే ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రత్యేకంగా, 2016 నుండి 2024 వరకు 127 ఎస్ఎస్ఐ యూనిట్లపై విధించిన బ్యాక్ బిల్లింగ్ రూ.19 కోట్లుగా ఉండగా, సర్చార్జిలతో కలిపి అది ప్రస్తుతం రూ.38 కోట్లకు చేరిందని తెలిపారు. ఈ భారీ భారం కారణంగా అనేక పవర్లూమ్ యూనిట్లు మూతపడటంతో పాటు, కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇటీవల కాలంలో 13 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడిన విషయాన్ని ప్రస్తావిస్తూ, దీనిని మానవీయ కోణంలో చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ నేపథ్యంలో KTR ప్రభుత్వం ముందుకు మూడు ముఖ్య డిమాండ్లు ఉంచారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ఉన్న బ్యాక్ బిల్లింగ్ మరియు సర్చార్జి మొత్తాలను పూర్తిగా మాఫీ చేయాలని, పాత బకాయిలతో సంబంధం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సబ్సిడీ అందేలా ఆదేశాలు ఇవ్వాలని, అలాగే కార్మికులు మళ్లీ ఆత్మహత్యల బాట పట్టకుండా తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
సిరిసిల్ల నేతన్నల సమస్య కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాదని, ఇది వేలాది కుటుంబాల జీవనోపాధికి సంబంధించినదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సమస్యపై ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
