Speed Up KBR Park Flyover Works, Directs Jayesh Ranjan
Hyderabad: నగర ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక అధికారి జయేష్ రంజన్ ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. గురువారం ఆయన క్షేత్రస్థాయిలో ఫ్లైఓవర్ పనుల పురోగతిని పరిశీలించారు.
ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్, రోడ్ నెంబర్ 45 వరకు కొనసాగుతున్న పనులను జయేష్ రంజన్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్లతో కలిసి సమీక్షించారు. పనుల నాణ్యత, వేగం, ట్రాఫిక్ నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ నగరానికి అత్యంత ముఖ్యమైనదని, దీని ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు శాశ్వతంగా తగ్గే అవకాశం ఉందని జయేష్ రంజన్ పేర్కొన్నారు. ప్రాజెక్ట్ను నిర్దిష్ట కాలపట్టికలో పూర్తి చేయడానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి వారం పనుల పురోగతిని సమీక్షిస్తూ, ఆలస్యాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్మాణంలో ఎటువంటి నాణ్యత లోపాలు లేకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని తెలిపారు.
ఇదిలా ఉండగా, పనులను వేగంగా పూర్తి చేయడానికి కాంట్రాక్టర్ సంస్థ ఎంఈఐఎల్ (మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్) అదనపు యంత్రాలు, మానవ వనరులను వినియోగంలోకి తీసుకురావాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. పనుల వేగం పెంపుతో పాటు ట్రాఫిక్కు అంతరాయం తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
క్షేత్ర తనిఖీలో ఈఈ (ప్రాజెక్ట్స్), డీఈఈ, ఏఈఈ స్థాయి ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. అధికారులు ప్రాజెక్ట్ పురోగతిని వివరించగా, జయేష్ రంజన్ పలు కీలక సూచనలు చేసి, పనులను వేగవంతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
