‘పెద్ది’ నా కెరీర్లో నంబర్ వన్ సినిమా: భోపాల్ ఈవెంట్లో రామ్ చరణ్ భావోద్వేగం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, రెండు చార్ట్బస్టర్ పాటలు, పవర్ఫుల్ థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానున్న ఈ చిత్రానికి జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్లు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా భోపాల్లో ‘పెద్ది కి ఆవాజ్’ పేరుతో నిర్వహించిన బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన బృందంతో కలిసి లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగా, వేలాది మంది ప్రేక్షకులు హాజరై ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చారు. ఇదే వేదికపై చిత్రంలోని మూడో సింగిల్ ‘హల్లల్ల ల్లో’ పాటను కూడా విడుదల చేశారు.
ఈ ఈవెంట్లో రామ్ చరణ్ మాట్లాడుతూ భోపాల్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ‘పెద్ది’ కేవలం స్పోర్ట్స్ సినిమా మాత్రమే కాదని, తన గుర్తింపుకోసం పోరాడే ఒక యువకుడి భావోద్వేగ ప్రయాణమని చెప్పారు. ఈ కథ ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతుందని, సినిమా చూసిన తర్వాత మళ్లీ మళ్లీ చూడాలనిపించే అనుభూతి కలుగుతుందని తెలిపారు. తన కెరీర్లో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ‘పెద్ది’ మాత్రం తన ఫిల్మ్ లైబ్రరీలో నంబర్ వన్ సినిమాగా నిలుస్తుందని భావోద్వేగంగా చెప్పారు. అలాగే దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత సతీష్ కిలారు, సహనటులు జాన్వీ కపూర్, దివ్యేందు, రవికిషన్తో పాటు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
హీరోయిన్ జాన్వీ కపూర్ మాట్లాడుతూ ‘పెద్ది’లో గొప్ప సందేశం ఉందని అన్నారు. రామ్ చరణ్తో కలిసి నటించడం గౌరవంగా భావిస్తున్నానని, ఆయన అంకితభావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. అలాగే ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు ప్రాణం పోసిందని కొనియాడారు.
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకుల ప్రేమ ఎప్పటికీ మరువలేనిదని చెప్పారు. చాలా కాలంగా నేరుగా ఒక తెలుగు సినిమాకు సంగీతం అందించాలని అనుకుంటున్నానని, ‘పెద్ది’ ద్వారా ఆ కోరిక నెరవేరిందని తెలిపారు. రామ్ చరణ్ తన డ్యాన్స్, పెర్ఫార్మెన్స్తో పాటలను మరో స్థాయికి తీసుకెళ్లారని, ఆయన ప్రతి మూమెంట్ వైరల్ అయిందని అన్నారు.
నటుడు రవికిషన్ మాట్లాడుతూ ‘పెద్ది’ ప్రతి యువకుడిని కనెక్ట్ అయ్యే సినిమా అని చెప్పారు. కొన్ని సన్నివేశాలు చూసి తన కళ్లలో నీళ్లు వచ్చాయని, ఈ చిత్రంతో రామ్ చరణ్కు నేషనల్ అవార్డు రావాలని కోరుకుంటున్నానని అన్నారు.
క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి విశ్వాస్ సారంగ్ మాట్లాడుతూ భోపాల్ ప్రజలు కళాకారులను ఎంతో ప్రేమిస్తారని, ‘పెద్ది’ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
దివ్యేందు శర్మ మాట్లాడుతూ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం ఆనందంగా ఉందని తెలిపారు. దర్శకుడు బుచ్చిబాబు అద్భుతమైన సినిమా తెరకెక్కించారని, ప్రేక్షకులకు పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ అందుతుందని చెప్పారు.
నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ భోపాల్తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఈ నగరాన్ని రెండో ఇల్లుగా భావిస్తానని అన్నారు. ‘పెద్ది’ కోసం రెండేళ్ల పాటు ఎంతో కష్టపడి పనిచేశామని, జూన్ 4న కుటుంబ సమేతంగా థియేటర్లలో సినిమా చూసి ఆదరించాలని కోరారు.

