హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) పేరును ఉపయోగిస్తూ సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. వాటర్ బిల్ అప్డేట్, మీటర్ రీడింగ్ నమోదు, CAN నంబర్ వెరిఫికేషన్ వంటి కారణాలు చూపిస్తూ ప్రజలను మోసం చేసి వారి బ్యాంకు ఖాతాల నుంచి భారీ మొత్తాలను దోచుకుంటున్నట్లు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం, బాధితులకు WhatsApp సందేశాలు, SMSలు లేదా ఫోన్ కాల్స్ ద్వారా సంప్రదించి “మీ వాటర్ బిల్ అప్డేట్ కాలేదు”, “మీటర్ రీడింగ్ నమోదు కాలేదు”, “CAN నంబర్ ధృవీకరణ పెండింగ్లో ఉంది”, “ఈ రాత్రి నీటి కనెక్షన్ నిలిపివేయబడుతుంది” వంటి సందేశాలతో భయాందోళనకు గురిచేస్తున్నారు. అనంతరం సమస్యను పరిష్కరిస్తామని చెబుతూ APK ఫైళ్లు లేదా Quick Support, AnyDesk వంటి రిమోట్ యాక్సెస్ యాప్లను డౌన్లోడ్ చేయాలని సూచిస్తున్నారు.
కొన్ని సందర్భాల్లో కేవలం రూ.10, రూ.13 లేదా రూ.20 మాత్రమే చెల్లించాలని చెప్పి అనుమానాస్పద లింక్లను పంపుతున్నారు. బాధితులు అవి అధికారిక సూచనలేనని భావించి యాప్లను ఇన్స్టాల్ చేయడం లేదా చెల్లింపులు చేయడం ద్వారా మోసగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు.
అయితే అసలు మోసం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఫోన్లో ఇన్స్టాల్ చేసిన యాప్ల ద్వారా నేరగాళ్లు మొబైల్ స్క్రీన్ను గమనించడం, OTPలు మరియు SMSలను యాక్సెస్ చేయడం, బ్యాంకింగ్ మరియు UPI వివరాలను సేకరించడం, క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని దుర్వినియోగం చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. దీంతో బాధితులకు తెలియకుండానే వారి బ్యాంకు ఖాతాలు, UPI ఖాతాలు మరియు క్రెడిట్ కార్డుల నుంచి వేల నుంచి లక్షల రూపాయల వరకు నగదు మాయమవుతోంది.
ఈ నేపథ్యంలో HMWSSB పేరుతో వచ్చే సందేశాలు లేదా కాల్స్ను వెంటనే నమ్మవద్దని పోలీసులు సూచించారు. WhatsApp లేదా SMS ద్వారా వచ్చే APK ఫైళ్లను డౌన్లోడ్ చేయకూడదని, అపరిచితుల సూచనల మేరకు రిమోట్ యాక్సెస్ యాప్లను ఇన్స్టాల్ చేయవద్దని హెచ్చరించారు. అలాగే OTP, CVV, UPI PIN, బ్యాంక్ పాస్వర్డ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని పేర్కొన్నారు.
ఒకవేళ మోసానికి గురైనట్లయితే వెంటనే ఇంటర్నెట్ కనెక్షన్ను నిలిపివేసి, అనుమానాస్పద యాప్లను తొలగించి, బ్యాంకు ఖాతాలు మరియు UPI సేవలను బ్లాక్ చేయించాలని సూచించారు. అనంతరం 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు కాల్ చేయడం లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలని సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ టి. సాయి మనోహర్ తెలిపారు.
