హైదరాబాద్, జూన్ 19: రాష్ట్రంలో గత రెండున్నరేళ్లుగా ప్రభుత్వం నడవడం లేదని, కేవలం మాఫియా మాత్రమే రాజ్యమేలుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ K. T. Rama Rao తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు కాంగ్రెస్ పాలనపై పూర్తిగా విసిగిపోయారని, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలంగాణలో మళ్లీ గులాబీ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. మల్కాజిగిరిలో నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
మల్కాజిగిరితో పాటు హైదరాబాద్ మొత్తం బీఆర్ఎస్ వైపే ఉందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ విజయఢంకా మోగిస్తుందని కేటీఆర్ అన్నారు. తెలంగాణకు మళ్లీ మంచి రోజులు రావాలన్నా, హైదరాబాద్ అభివృద్ధి తిరిగి వేగం పుంజుకోవాలన్నా బీఆర్ఎస్ అధికారంలోకి రావాల్సిందేనని పేర్కొన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి K. Chandrashekar Rao నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా సాగాయని కేటీఆర్ గుర్తు చేశారు. 2014కు ముందు విద్యుత్ కోతలు, తాగునీటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిందన్నారు. వ్యవసాయానికి, గృహ అవసరాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామని, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సమస్యలను అధిగమించామని చెప్పారు.
సంక్షేమ రంగంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం స్వర్ణయుగాన్ని తీసుకొచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. పెన్షన్ల పెంపు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, కల్యాణలక్ష్మి వంటి పథకాల ద్వారా లక్షలాది కుటుంబాలకు అండగా నిలిచామని చెప్పారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోనే వేలాది డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందజేశామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని కేటీఆర్ ఆరోపించారు. రైతుభరోసా, మహాలక్ష్మి, పెన్షన్ పెంపు వంటి హామీలు ఇప్పటికీ అమలుకాలేదని విమర్శించారు. వంద రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి A. Revanth Reddy నాయకత్వంలోని ప్రభుత్వం అప్పులు చేయడం తప్ప కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని మండిపడ్డారు.
హైదరాబాద్లో బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమైన అభివృద్ధి పనులకే ఇప్పుడు రిబ్బన్ కటింగ్లు జరుగుతున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. టిమ్స్ ఆసుపత్రులు, మౌలిక సదుపాయాల నిర్మాణం, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ వంటి కార్యక్రమాలను గుర్తు చేశారు. మరోవైపు పేదల ఇళ్లు కూల్చడం, రైతులకు తగిన మద్దతు లేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు ఉదాహరణలని విమర్శించారు.
పార్టీ కార్యకర్తలు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరింత చురుకుగా పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా బూత్ స్థాయి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన కొత్త ఓటర్లను నమోదు చేయాలని కోరారు.
బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు ప్రత్యేక మెంబర్షిప్ యాప్ను అందుబాటులోకి తీసుకువస్తున్నామని కేటీఆర్ తెలిపారు. కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి సభ్యత్వ నమోదు చేపట్టి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్యకర్తలంతా ఐక్యంగా పోరాడాలని, తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని ఆయన కోరారు.
BRS Will Return to Power in Telangana: KTR
