సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవితో తెలుగు సినీ పరిశ్రమ కీలక సమావేశం
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కొనసాగుతున్న పర్సెంటేజ్ షేరింగ్ సమస్యపై తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసి చర్చించారు. తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, టీఎఫ్సీసీ ప్రెసిడెంట్ సురేష్ బాబు, నిర్మాతలు కేఎల్ నారాయణ, అల్లు అరవింద్తో పాటు తెలంగాణ ఛాంబర్ ఎగ్జిబిటర్ల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశంలో ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, థియేటర్ల మూతపడుతున్న పరిస్థితులు, పర్సెంటేజ్ విధానంలో వస్తున్న ఇబ్బందులను చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్లారు. అన్ని విషయాలను శ్రద్ధగా విన్న చిరంజీవి గారు పరిశ్రమలోని ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా పరిష్కారం ఉండాలని అభిప్రాయపడ్డారు.
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పరిశ్రమకు అత్యున్నత సంస్థ అని గుర్తు చేసిన ఆయన, ఛాంబర్ తీసుకునే నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు. గతంలో ఏర్పాటు చేసిన కమిటీల పనితీరుపై సింగిల్ స్క్రీన్ సభ్యుల్లో కొంత అసంతృప్తి ఉందని అర్థం చేసుకున్నానని, అయితే ఈసారి ఏర్పాటు చేసిన కమిటీ జూన్ 30లోపు పూర్తి స్థాయిలో పరిశీలించి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు సమాన న్యాయం జరిగేలా ప్రతిపాదనలు తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కమిటీ సమయానికి నివేదిక సమర్పించేలా తాను కూడా సహకరిస్తానని చిరంజీవి గారు హామీ ఇచ్చారు. తమ సమస్యలను ఓపికగా విని భరోసా ఇవ్వడం పట్ల ఎగ్జిబిటర్లు సంతృప్తి వ్యక్తం చేశారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ, “ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను చిరంజీవి గారికి వివరించాం. ఆయన ఎంతో శ్రద్ధగా విని అర్థం చేసుకున్నారు. ఇప్పటికే ఛాంబర్ ఏర్పాటు చేసిన కమిటీ నుంచి మరిన్ని వివరాలు తీసుకుని సమస్యను త్వరగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెండు రోజుల్లో ఛాంబర్ అధికారికంగా వివరాలు ప్రకటిస్తుంది” అని తెలిపారు.
ఎగ్జిబిటర్ ప్రతినిధి శ్రీధర్ మాట్లాడుతూ, “దాదాపు గంటకు పైగా జరిగిన సమావేశంలో థియేటర్ల పరిస్థితి, ఎగ్జిబిటర్ల ఇబ్బందులను పూర్తిగా వివరించాం. చిరంజీవి గారి నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. కమిటీతో కూడా మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు” అన్నారు.
ఈ సమావేశంలో సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు, కేఎల్ నారాయణ, సునీల్ నారంగ్, భరత్ నారంగ్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు శేఖర్, అనుపమ్, శ్రీధర్, సదానంద్ గౌడ్, సుదర్శన్ థియేటర్ ప్రొప్రయిటర్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
