హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఆధునిక హంగులు, పచ్చదనం మరియు పారదర్శక సేవలతో సరికొత్త రూపాన్ని సంతరించుకుంది. ఇప్పటికే ప్రతిష్టాత్మక ISO 9001:2015 సర్టిఫికేషన్ను పొందిన ఈ పోలీస్ స్టేషన్ను సికింద్రాబాద్ జోన్ డీసీపీ శ్రీమతి రక్షిత కృష్ణమూర్తి అధికారికంగా ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి, స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ జె. నరసయ్య, ఏసీపీ ఎ. యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఇన్స్పెక్టర్) ఎన్. బోస్ కిరణ్ ప్రత్యేక చొరవతో గాంధీనగర్ పోలీస్ స్టేషన్ను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దారు. పర్యావరణహిత వాతావరణం, మెరుగైన మౌలిక వసతులు, ప్రజలకు సౌకర్యవంతమైన సేవలందించే విధంగా స్టేషన్లో విస్తృత మార్పులు చేపట్టారు.
స్టేషన్లోని పాత దస్త్రాలు, ఎఫ్ఐఆర్ సూచికలు మరియు స్వాధీనం చేసుకున్న వస్తువులను క్రమబద్ధీకరించి రికార్డు నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చారు. భవనానికి నూతన రంగులు వేయడంతో పాటు ఆధునిక ఎల్ఈడీ లైట్లు అమర్చారు. లీకేజీలను అరికట్టి వాటర్ప్రూఫింగ్ పనులు పూర్తి చేశారు.
స్టేషన్ పరిసరాల్లో రోడ్లపై పేరుకుపోయిన పాత, పాడుబడిన మరియు జప్తు చేసిన వాహనాలను తొలగించి ప్రత్యేక ప్రదేశంలో నిల్వ చేయడంతో విశాలమైన ఖాళీ స్థలం అందుబాటులోకి వచ్చింది. ప్రజల కోసం ప్రత్యేక రిసెప్షన్ సెంటర్, సిబ్బందికి ఆధునిక విశ్రాంతి గదులను ఏర్పాటు చేశారు.
పచ్చదనానికి పెద్దపీట వేస్తూ స్టేషన్ సరిహద్దు గోడల వెంట ఆకర్షణీయమైన కుండీల్లో వివిధ రకాల మొక్కలను నాటారు. చెట్ల కొమ్మలను క్రమపద్ధతిలో కత్తిరించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని రూపొందించారు.
ఈ సందర్భంగా డీసీపీ రక్షిత కృష్ణమూర్తి మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్లను ప్రజలకు మరింత చేరువ చేసేలా ఆధునికీకరణ అవసరమని తెలిపారు. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ను ISO ప్రమాణాలకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన సీఐ బోస్ కిరణ్ సేవలను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది హరీష్, నరసింహ, మౌనిక, సాయి, నయూమ్ తదితరులు పాల్గొన్నారు.
